
"We believe in the human body's innate ability to overcome disease by itself. Our role is to understand the causes and set the natural pattern right in the least harmful and the most natural way"

Dr. Anil Nanduri |
|  |
17వ శతాబ్దంలో వైద్య విధానం ఏమాత్రం మానవతా దృక్పధం లేని ఒక మోటు నాటువైద్యంలా ఉండేది. శరీరంలో ఎక్కడ, ఎటువంటి బాధ ఉన్నా అక్షరాల రక్తం కాదు కాదు రక్తధారలు కళ్ళచూసేవారు. ఇది చాలదన్నట్లు, కాల్చి వాతలు పెట్టడం (శునక ముద్రలు), జలగలతో రక్తాన్ని పీల్చేయించడం, శరీరంలో కత్తితో గాయం చేసి కప్పులతో రక్తాన్ని తీయడం వంటి హింసాత్మక విధానాలు చికిత్స పేరుతో జరుగుతుండేవి. ఔషధాలకు ఉపయోగించే వనమూలికల సంఖ్య కాని వాటి పరిమాణాలు కాని మానవుని ఊహకందని విషయాలు. మొత్తం మీద 200 ఘటక ద్రవ్యాలున్నా వాటి ధర్మాలేంటో తెలియవు. ఇక మందు మోతాదు డాక్టర్ల చిత్తం, పేషంట్ల భాగ్యమే తప్ప ఖచ్చితంగా ఇంత మోతాదని లేదు. ఇలాంటి అవక తవక పరిస్థితులలో 1755లో జర్మనీలోని మెయిసెన్ అనే చిన్న పట్టణంలో అక్టోబర్ 10న హోమియోపతివైద్యశాస్త్రాన్ని కనిపెట్టిన హానెమాన్ జన్మించారు.
హానెమాన్ పై వారి తండ్రిగారి ప్రభావం చాలా ఉంది. ఏవిషయాన్నైనా గుడ్డిగా నమ్మకుండా దాన్ని శోధించి తెలుసుకోవడం అనే చక్కటి గుణాన్నితండ్రి ద్వారా అలవర్చుకున్నారు. వైద్యశాస్త్రంలో పట్టభద్రుడై వైద్య వృత్తిని స్వీకరించారు. కాని త్వరలోనే ఇతర వైద్యుల చికిత్సా విధానాలను చూసాక వారికి ఈ వృత్తిమీదే విరక్తి పుట్టింది. ఔషధ సేవనం వల్ల వ్యాధి తగ్గక పోగా పరిస్థితి విషమిస్తున్నదని గ్రహించారు. వైద్యం చికిత్స చేయక పోగా చితిని తయారు చేస్తుందని వాపోయారు. నిరాశా, నిస్పహతో క్రుంగి పోయిన హానెమాన్ వైద్యవృత్తిని మాని బ్రతుకు తెరువు కోసం పుస్తకాలను అనువదించడం మొదలు పెట్టారు. అటువంటి సందర్భంలోనే కల్లేన్స్ వ్రాసిన మెటీరియా మెడికా చదవడం జరిగింది.
చేదుగా ఉండటంవలన సించోనా చెట్టు బెరడు (క్వినైన్) మలేరియాను తగ్గిస్తుందని చదివారు. కాని, ఈ వివరణ వారికి సంతృప్తికరంగా అనిపించక దీని అమీ-తుమీ తేల్చాలని నిశ్చయించుకున్నారు. ఆయన పెరువియన్ బెరడుతో కషాయం తయారు చేసి కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా సేవించారు. కొద్ది రోజుల తర్వాత చలి, వణుకు, జ్వరం, చెమటలు వంటి మలేరియా లక్షణాలు తనలో రావడం గమనించారు. కషాయం తాగడం మానేసాక ఈ లక్షణాలు అన్నీ మాయమయ్యాయి. ఈ ప్రయోగాన్నే మళ్ళీ తన పైనా, కుటుంబ సభ్యుల పైన కూడా చేసారు. చేసిన ప్రతీసారి అవే లక్షణాలు ఉండటం గమనించారు. అందువల్ల వారు "ఏ పదార్థం వల్ల బాధ వస్తుందో దానినే మందుగా వాడితే ఆ బాధ నివారిస్తుందనే సూత్రాన్ని ప్రతిపాదించారు. పుస్తకాలు విపరీతంగా చదివే అలవాటు ఉండటంవల్ల వైద్య శాస్త్రపు పత్రికలలో గతంలో జరిగిన ఇటువంటి సంఘటనలు చాలా చదివారు, కాని వాటి వివరణలు ఏమాత్రం త్రప్తికరంగా లేవు.
అందువల్ల కార్య కారణ సంబంధాన్ని వెతికే కార్యక్రమానికి నడుం బిగించారు. తన స్నేహితుల పైనా, కుటుంబ సభ్యుల పైనా ప్రయోగాలు జరిపారు. రక రకాల పదార్థాలను ఇచ్చి వారిలో వచ్చే మార్పులను, లక్షణాలను రికార్డ్ చేయడం మొదలు పెట్టారు. సహజంగా వచ్చే వ్యాధిలక్షణాలు ఆయాపదార్థాలవల్ల, అవి సేవించిన వారిలో కన్పించడంతో వారింతకు ముందు ప్రతిపాదించిన సిధ్ధాంతం రూఢి అయ్యింది. హానెమాన్ కంటే చాలా ముందుగా వైద్య శాస్త్రపిత అయిన హిప్పొక్రేట్స్ 'similia similibus curentur' ఏ పదార్థం వ్యాధికి కారణమో అదే చికిత్సకు ఉపయుక్తమని చెప్పారు. ప్రాచీన హిందూ వైద్య విధానమైన ఆయుర్వేదంలో కూడా ఇలాంటి విషయం ప్రస్తావించారు. కాని హానెమాన్ రంగ ప్రవేశం చేసేంతవరకు ఈ సిధ్ధాంతం రూఢి అవక పోగా మందుల మోతాదు విషయంలోఎటువంటి స్పష్టత కాని నిర్ణీతమైన పధ్ధతి కాని లేదు. ఎక్కువ మోతాదా? బహు బాగు అన్నధోరణి ఉండేది. హానెమాన్ మోతాదులను తగ్గించి ప్రయోగాలు చేసి చూసారు. గ్రెయిన్ డోసులు, అర గ్రెయిన్ డోసులు, మూలికల ఔషధాలయితే ఇన్ని చుక్కలు అని. మందు మోతాదు ఎంత తగ్గించినా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఇచ్చినపుడు, ఆయా వ్యాధుల లక్షణాలను ఉత్పన్నం చేస్తుండటం ఆయన గమనించారు.
ప్రధానంగా ఒకే మందునిచ్చి ఫలితాలను పరీక్షించిన మొట్టమొదటి వ్యక్తి హానెమాన్. ప్రత్యేక పరిమాణంలో మందులనిచ్చి వచ్చిన ఫలితాలను రికార్డ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి కూడా వీరే, అంటే మందు మోతాదులను నిర్ధారణ చేశారన్నమాట. ఈ రెండు ప్రధాన అంశాలగురించి ఆయన్ని ఎంత అభినందించినా తక్కువే అవుతుంది.
తన ప్రయోగాలనాధారం చేసుకొని హోమియోపతి సిద్ధాంతాలైన "సామాన్య, సారూప్య ఔషధాల"ను నిర్ధారించారు. "ఎల్లోపతి" (వైవిధ్యపు బాధ) అనే పదాన్ని వాడుకలోనికి తెచ్చినది కూడా వారే. హోమియోపతి (ఒకే రకమైన బాధ) నుండి అది భిన్నమైనది అని చూపించడమే వారి ఉద్దేశ్యము. ఆ రోజుల్లో "ఏంటీపతి" కూడా ప్రచారంలో ఉంది. రోగికి ఉన్న వ్యాధికి పూర్తిగా వ్యతిరేక లక్షణాలు వచ్చే ఔషధాన్నిచ్చే వైద్యాన్ని ఏంటీపతి అంటారు. ఉదాహరణకు మలబద్ధకంతో బాధపడే వ్యక్తికి విరేచనాలకు మందివ్వడం, నిద్రలేమితో బాధపడే వారికి నిద్రమాత్రలు లాంటివి. కాని, అసలు సమస్యకు కారణం ఏమిటి అనే విషయము బొత్తిగా పట్టించుకునేవారు కాదు. ఇలాంటి వైద్యవృత్తి ఈ రోజుల్లో కూడా బాగానే కన్పిస్తుంటుంది.
ఆధునిక వైద్యవిధానం ఎలా పని చేస్తుందో చూద్దాం - కాఫీ మరీ తియ్యగా ఉంటే దానికి కొంచెం డికాక్షన్ కలపడంవల్ల విశేష మార్పు వస్తుంది. నాలుకపైన నాలుగైదు పంచదార బిళ్ళలు కాని ఏదైనా తీపి పదార్థం పెట్టుకొని కాఫీ తాగినట్లైతే ఆ తీపి రుచి తగ్గుతుంది. లేదా కొద్దిగా మారుతుందనే ప్రాతిపదికపై హోమియోపతి వైద్య విధానం పని చేస్తుంది. ఈ చికిత్స తీసుకుంటున్న వ్యక్తిలో ప్రస్ఫుటమైన చక్కటి మార్పు కన్పిస్తుంది.
ఆయా పదార్థాలను చాలా తక్కువ మోతాదులో చక్కటి ఆరోగ్యవంతునికిచ్చి ఫలితాలను రికార్డు చేస్తారు. ఎప్పుడైతే రోగి సమగ్ర లక్షణాలకు ఆ మందు సరియైనదని అనిపిస్తుందో దానినే సత్ఫలితం కోసం ఇస్తారు.
ఉదాహరణకు ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లనుండి నీళ్ళు కారడం, ముక్కు కారడం చాలా సాధారణ విషయం. ఈ రెండు లక్షణాలు సాధారణ జలుబు లక్షణాలు కూడా. అందువల్ల "ఏలియం సెపా" (మామూలు ఉల్లిపాయ) ను చిన్న చిన్న మోతాదులలో జలుబు తగ్గడానికి ఇస్తారు. వేర్వేరు పదర్థాలవల్ల కూడా వ్యక్తులలో కళ్ళు, ముక్కు కారడం లాంటి జలుబు లక్షణాలు కనిపిస్తాయి. మొదటి సారిగా సిగరెట్, బీడీ లాంటివి తాగినా, లేదా పొగాకు నమిలినా కడుపులో తిప్పడం, కళ్ళు బైర్లు కమ్మడం, వికారం, వాంతులు, చల్ల చెమటలు, స్పృహ తప్పిపోవడం, ఒక్కొక్క సారి మృత్యువు - ఇలా విషప్రయోగ ఫలితాల్లాంటివి కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తుడైన ఒక వ్యక్తిలో ఇటువంటి లక్షణాలు కనిపించినట్లైతే అతనికి టబాకం (tabacum) లక్షణాలుగా భావించి టబాకం ఔషధం ద్వారా చికిత్స చేస్తారు. అయితే ఆ మందు తయారీలో పొగాకు అత్యంత స్వల్ప పరిమాణంలో వాడటం జరుగుతుంది.
దీర్ఘ కాలిక వ్యాధుల విషయాన్ని మొదటగా ప్రస్తావించినది కూడా హనేమానే. అలాగే వ్యక్తులకు వారసత్వంగా కొన్ని వ్యాధులు సంక్రమించవచ్చు అనే విషయాన్ని గుర్తించినది కూడా వారే. జన్యుశాస్త్రం (genetics) అనే పదము ఉపయోగంలో రావడానికి కొన్ని శతాబ్దాలకు ముందుగా జరిగిన విషయమిది. ఈ విధంగా జీన్స్ ద్వారా వ్యాధులు సంక్రమించడానికి ఉన్న అవకాశాన్ని ఆయన మియాస్మ్స్ (miasms) అన్నారు. ఆ వ్యక్తికి అటువంటి వ్యాధిని సంక్రమింపచేసుకునే లక్షణాలు ఉంటాయని ఆయన గట్టిగా చెప్పారు. ఉదాహరణకి మనమందరమూ ఎప్పుడూ ఎల్లర్జన్స్ (వాయుమండల కాలుష్యం వల్ల వచ్చే ఎలర్జీలు), మైక్రోబ్స్ (ఫ్లూ, మలేరియా, దగ్గు మొదలైన వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులు) కార్సినోజన్స్ (కాన్సర్ కు దారి తీసే ఏ పదార్థమైనా అవచ్చు) వీటి దాడికి గురి అవుతూనే ఉన్నా కొంత మంది మాత్రం వీటికి బలి అవుతున్నారు. కారణం వారు ఆ జన్యు కణాలను వారసత్వంగా పొందడమే. అస్వస్థతను తీవ్రం చేయడానికి తోడ్పడే ప్రధాన అంశమైన వాతావరణ ప్రభావాన్ని హానెమాన్ రెండవ అంశంగా పరిగణించారు. వ్యక్తి దృక్పధం మూడవ అంశంగా ఆయన గుర్తించారు. ఆలోచనా సరళి, జీవన విధానాన్ని బట్టి కొన్ని కొన్ని వ్యాధులు కొంతమంది వ్యక్తులకు చాలా త్వరగా రావడానికి అవకాశం ఉంది. మొత్తం మీద హానెమాన్ సైకోసోమాటిక్ వైద్యవిధానానికి తండ్రి అని చెప్పవచ్చు.
|
 |